
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి.. గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పని చేశారు. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విధులు నిర్వహించారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా సైతం ఆయన పని చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం.ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని మోదీ ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు ఆశలపై ఇండియా కూటమి నీళ్లు చల్లింది. ఆ క్రమంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకువచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు సీపీ రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇండియా కూటమి సైతం ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని భావించింది. అందులోభాగంగా తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఎవరూ ఊహించని విధంగా తెర పైకి తీసుకు వచ్చింది.సెప్టెంబర్ రెండో వారంలో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు.. అంటే పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు..మొత్తం 786 తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే కూటమికి తగినంత బలం ఉంది. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ సైతం సాగుతోంది.


