
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణకు సిద్ధమా? అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. ఆదివారం తనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలపై పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ విలేకర్ల ఎదుట స్పందించారు. ఈ సందర్భంగా అరికేపూడి గాంధీ మాట్లాడుతూ.. తనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేసిన భూమి అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూములతో ఎస్ఎఫ్సీకీ సంబంధం లేదని హైకోర్టు చెప్పిందని ఈ సందర్భంగా అరికెపూడి గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే.. అందుకు సంబంధించిన వివరాలను తాను ఇచ్చే వాడినన్నారు.
హైదరాబాద్ గాజులరామారంలోని 307 సర్వే నంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాధవరం కృష్ణారావు, దాసోజ్ శ్రవణ్ తదితరులు గతంలో ఫిర్యాదు చేశారు. సదరు స్థలంలో బడాబాబుల్లో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ను కోరారు. ఈ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వ వద్దంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ను సైతం వారు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రూ. వేల కోట్ల విలువైన ఈ 320 ఎకరాల భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేశారంటూ వారు ఆరోపించారు.


