
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
హైదరాబాద్ అక్టోబరు 30 (గోల్కొండ ):
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొంథా తుపాన్ అలజడి సృష్టించింది. భారీగా పంట నష్టం సంభవించింది. ఒక్క తెలంగాణలోనే 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ మేరకు మొంథా తుపాన్ పంట నష్టంపై తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2,53,033 మంది రైతులు పంటను నష్టపోయారు. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి పంట నాశనం అయింది.
వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాలు.. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు.. నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ మొత్తం 12 జిల్లాలు, 179 మండలాల్లో పంట నష్టం నమోదు చేసింది. పూర్తి స్థాయి సర్వేతో నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాల్లో త్వరలో పర్యటించనున్నారు. ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై అధికారులు సీఎం రేవంత్తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


