
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ
నిజామాబాద్ అక్టోబరు 21 (గోల్కొండ ) : రౌడీ షీటర్ రియాజ్ చేతులో మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సహాయం చెక్కుతో పాటు 300 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను డీజీపీ అందజేశారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రమోద్ భార్య మాట్లాడుతూ.. డీజీపీ సార్ తమ కుటుంబానికి భరోసా ఇచ్చారన్నారు. ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామన్నా తెలంగాణ ప్రభుత్వంకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా భర్త లేని లోటు తీర్చలేరు కానీ, మా కుటుంబానికి జరిగినట్లు మరో కుటుంబానికి జరుగకుండా టాస్క్కు వెళ్ళేటప్పుడు పోలీసులకు వెపన్స్ కల్పించాలని ప్రమోద్ భార్య కోరారు.
అనంతరం, డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రియాజ్ను పట్టు కోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్కు రూ. 50 వేల రివార్డు అందించామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్పై విచారణకు ఆదేశించామని, డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారందరూ జన జీవన స్రవంతి లోకి రావాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.


