
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల….
ఢిల్లీ, అక్టోబర్ 06 (గోల్కొండ ): బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. దీనికి సంబంధించి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించామని సీఈసీ సభ్యులు తెలిపారు. బిహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని కూడా సీఈసీ తెలిపింది. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా.. ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది.ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సారి ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడించింది. బిహార్ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ వెబ్క్యాస్టింగ్ ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది.
రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. నవంబర్ 6న తొలి విడత పోలింగ్, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3 కోట్ల 92 లక్షల మంది పురుష ఓటర్లు, 3 కోట్ల 50 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు వివరించారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ మొబైల్ డిపాజిట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో హింసను, ఓటర్లు, అభ్యర్థులను బెదరించడాన్ని ఏమాత్రం సహించేది లేదని, ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి కఠిన ఆదేశాలిచ్చామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర వేదకలపై నకలీ వార్తలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.


