
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు
రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు
పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం
హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ):
దేశ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేటి నుంచి ఐదు రోజుల పాటు చండీగఢ్లో నిర్వహించే సీపీఐ జాతీయ మహాసభలలో పార్టీలో యువత భాగస్వామ్యం పెంపు, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై చర్చిస్తాం. పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై మహాసభల్లో చర్చిస్తాం. గత పదకొండు ఏళ్లుగా బీజేపీ దేశంలో నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. అండమాన్ నికోబార్ దీవులను అదానికి కేంద్రం అప్పగించింది. రేషన్ బియ్యం తినేవారు లేరని కార్డులను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. సెల్ఫోన్లు ఉంటే ధనవంతుల కింద కేంద్రం లెక్కకడుతోంది. ఫుట్ పాత్పై పడుకునేవారూ సెల్ఫోన్ వాడుతున్నారు. ఫోన్వాడినంత మాత్రాన పేదరికం లేనట్లా?’ అని ప్రశ్నించారు.


