
పూర్తి ఏసీ కోచ్లతో ఎంఎంటీఎస్ రైళ్లు.
హైదరాబాద్ ఆగస్టు 17 (గోల్కొండ ):
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు ప్రకటించారు
భాగ్యనగర వాసులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలకు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయ్. సాధారణంగా ప్రజలు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణించేందుకు బస్సులు, ఆటోలు, సొంతవాహనాలు, మెట్రో, లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ నే ఆశ్రయిస్తుంటారు. అయితే, ట్రాఫిక్ రద్దీని భరించలేక ఇటీవల ఎక్కువమంది మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. కానీ, ఇది వరకంతా లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ దే హవా. ఈ లోటు పూడ్చేందుకు మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రైళ్లను త్వరలోనే ఏసీ కోచ్లతో నడవనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.


