
మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా..
పాట్నా నవంబరు 03 (గోల్కొండ ) : బిహార్లో ‘మహాగఠ్బంధన్’ అధికారంలోకి రాబోతోందని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ త్వరలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారనే పూర్తి నమ్మకం తనకు ఉందని చెప్పారు.
ఆరోగ్య కారణాల రీత్యా కొద్దికాలంగా నేరుగా ఎన్నికల ప్రచారానికి లాలూ దూరంగా ఉంటున్నారు. అయితే ‘మహాగఠ్బంధన్’కు స్ట్రాజజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లాలూ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉండబోతోందని, నవంబర్ 14న ప్రభుత్వం మారబోతోందని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తేజస్వి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతోందని, కూటమి విజయం సాధిస్తుందని లాలూ చెప్పారు. స్థానిక నేతలు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తేజస్వికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు. మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ వైశాలి జిల్లా రఘోపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కోసం తలపడుతున్నారు. 2015 నుంచి ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై బీజేపీ నేత సతీష్ కుమార్, జన్ సురాజ్ నేత చంచల్ కుమార్ పోటీ పడుతున్నారు. బిహార్ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


