
అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన
అమరావతి, ఏప్రిల్ 08 (గో ల్కొండ):కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారని తెలిపారు. ఏబీఎన్ ఛానెల్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు. ‘జెన్ – జీ’ని తక్కువ అంచనా వేయొద్దని పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో జెన్ – జీ గురించి ప్రస్తావిస్తారని అన్నారు. జెన్ జీ తరం వారి ఆలోచనలను, వారి నిశిత పరిశీలనను ప్రజా జీవితంలో ఉన్నవారు తక్కువ అంచనా వేయకూడదని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీస్ నడవడికను, వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జెన్ – జీ పరిశీలిస్తుందని అన్నారు. 90వ దశకం రాజకీయాలు, హద్దులు దాటే మాటలు, అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లిందనే వాస్తవాన్ని ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్లేషకులు పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్నారని ప్రస్తావించారు. జనసేన నాయకులకు, వీర మహిళలకు, శ్రేణులకు కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయాలని పార్టీ ముఖ్యులను పవన్ కల్యాణ్ ఆదేశించారని జనసేన అగ్రనేతలు పేర్కొన్నారు.


