
ఎన్నికలు న్యాయంగా జరిగితే, బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుంది: ఓటర్ అధికార్ యాత్రలో స్టాలిన్
ఓటరు అధికార్ యాత్ర’లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
పాట్నా ఆగస్టు 27 (గోల్కొండ ): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం.. ఎన్నికల కమిషన్ను కీలుబొమ్మగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలు న్యాయమైన రీతిలో జరిగితే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్లో జరుగుతోన్న ‘ఓటరు అధికార్ యాత్ర’లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం.. ఎన్నికల సంఘాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతూ దానిని కీలుబొమ్మగా మార్చిందని ఆరోపించారు.
బీహార్ ప్రజలను ఓటర్ల జాబితా నుండి తొలగించడం సరైంది కాదని స్టాలిన్ తమిళంలో జనాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ – తేజస్వి యాదవ్ మధ్య స్నేహం కేవలం రాజకీయ సంబంధం కాదని, ఇది ఇద్దరు సోదరుల మధ్య సంబంధమని స్టాలిన్ అన్నారు. ఈ స్నేహం వారిని విజయ తీరాలకు చేరుస్తుందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తామంతా ఐక్యంగా ఉన్నామని స్టాలిన్ తెలిపారు.
నా సోదరులకు మద్దతు ఇవ్వడానికి నేను తమిళనాడు నుండి వచ్చాను. ఎన్నికల కమిషన్ చేసిన ‘ఓటు చోరీ’ని రాహుల్ గాంధీ బయటపెట్టారు. రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి అని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అంటున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఇలాంటి వాటికి భయపడతారా?… ఈరోజు, బిజెపి ఎన్నికలను ఎలా జోక్గా మార్చిందో చూపించినందున రాహుల్ పై దాడి చేస్తోంది’ అని స్టాలిన్ అన్నారు.అంతకుముందు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహాని, సీపీఐ (ఎంఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్యతో కలిసి ఓపెన్ వాహనం నుండి ఇండియా కూటమి మద్దతుదారులతో కలిసి స్టాలిన్ ర్యాలీలో పాల్గొన్నారు.


