
బాలిక హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు.
హైదరాబాద్ ఆగస్టు 22 (గోల్కొండ ):
కూకట్పల్లిలో బాలిక(11 ) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకు వెల్లడించారు. అమ్మాయిని 10వ తరగతి చదువుతున్న అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టారు. నిందితుడు తాను బాలికను ఎందుకు చంపాననే వివరాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. బాధితుల ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటున్న ఈ అబ్బాయి. దొంగతనం కోసం బాలిక ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే చోరీ సమయంలో తనను బాలిక చూడటంతో.. ఆమె పై నిందితుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది.రేణుక, కృష్ణ దంపతులు కూకట్పల్లిలో కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. కృష్ణ మెకానిక్గా.. రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నారు. ఎప్పట్లాగానే వీరిద్దరూ తమ తమ విధులకు వెళ్లారు. ఇంట్లో కూతురు మాత్రమే ఉంది. అయితే, కృష్ణ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. తలుపు ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. రక్తపు మడులో తన బిడ్డ పడి ఉండటం చూసి గట్టిగా అరిచాడు. స్థానికులు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. బాలిక శరీరంపై 20 కత్తిపోట్లు గుర్తించిన పోలీసులు.. నిందితులు ఎవరనేది తేల్చడానికి ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలించారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఈ క్రమంలో లభించిన ఒక ఎవిడెన్స్తో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి హత్యపై గత ఐదు రోజులుగా అనేక ప్రచారాలు జరిగాయి. చివరకు అమ్మాయిని చంపేసింది.. ఒక మైనర్ బాలుడు అని తెలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


