రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం సూటిగా స్పందించింది. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని ఆయనకు అల్టిమేటం ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని పేర్కొంది.
న్యూఢిల్లీలోని ఆదివారంనాడు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు నిరాధారమని అన్నారు. ‘మీ ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి. లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి. మూడో ఆప్షన్ లేదు. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ మాకు అందకుంటే దాని అర్ధం ఆ ఆరోపణల్లో నిజం లేనట్టే’ అని ఆయన అన్నారు. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా, ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. డబుల్ ఓటింగ్‌పై కొందరి ఆరోపణలను ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు సరికాదని, ఇలాంటి ఆరోపణలకు దేశంలోని ఓటర్లు కానీ, ఎన్నికల కమిషన్ కానీ భయపడే ప్రసక్తే లేదన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!