
పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్తో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ ఏప్రిల్ 11 (గోల్కొండ ): మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో శనివారంనాడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేరణా స్థల్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్దిసేపు సంభాషించుకున్నారు.తొలుత ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని అక్కడే ఉన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో బీజేపీ నేత జేపీనడ్డా, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులను పలకరిస్తూ ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో ప్రధాని, ప్రతిపక్ష నేత పరస్పరం సంభాషించుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇటీవల కాలంలో పలు పబ్లిక్ స్పీచ్లు, రాజకీయ ర్యాలీల్లో మోదీ, రాహుల్ మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయి. మోదీ రాజీపడే నేత అని, మన విదేశాంగ విధానం మోదీ పర్సనల్ పాలసీగా మారిందని, ఆయన ఏమి చేయాలో ఏమి చేయకూడదో ట్రంప్ నిర్దేశిస్తుంటారని రాహుల్ విమర్శలు గుప్పించారు. రాహుల్ విమర్శలను మోదీ తిప్పికొట్టుతూ, ఆయనొక స్వయం ప్రకటిత రాజకుమారుడని చురకలు వేశారు.


