
బీఆర్ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధ్వజం
హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ):తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని ఆయన అన్నారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల కుట్రలు పన్నినా.. కాంగ్రెస్పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. అందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొంత కాలంగా అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కవిత వేరు కుంపటి పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి రోడ్డున పడింది. పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు దూరమై.. కేవలం తన ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ.. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.. అందుకే ఆ పార్టీని దూరం పెడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. రాష్ట్రంలో 100 సీట్లు ఖాయం’ అని అన్నారు.


