
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం
ఖట్మండు, సెప్టెంబర్ 12 (గోల్కొండ ):నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో దేశ తొలి మహిళా ప్రధాని క్రెడిట్ను ఆమె దక్కించుకున్నారు. 73 ఏళ్ల సుశీల కర్కిని తాత్కాలిక సారథిగా ‘జన్ జీ’ ఉద్యమకారులు ఎంపిక చేశారు. నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్తో ‘జన్ జీ’ ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ ‘జన్ జీ’ ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు. దీంతో నేపాల్ పార్లమెంటును రద్దు చేశారు. ఆ వెనువెంటనే సుశీల కర్కి తాత్కాలిక పభుత్వ అధిపతిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.నేపాల్లో కొద్దిరోజులుగా జెన్జీ నిరనసలు ఉవ్వెత్తున ఎగసిపడటం, పెద్దఎత్తున అల్లర్లు, దహనకాండం, హింస చోటుచేసుకోవడం, ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లిపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ తొలి మహిళా చీఫ్ జస్టిస్, భారత్లోని బనారస్ హిందూ వర్శిటీ పాత విద్యార్థి అయిన సుశీల కర్కికి తాత్కాలిక ప్రధాని పదవి దక్కడం విశేషం.


