
రిషికేశ్లో రజనీ… రోడ్డుపక్కనే అల్పాహారం
రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ‘జైలర్-2’ చిత్రీకరణలో పాల్గోనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ రూటే సెపరేట్. బిజీగా నటజీవితం సాగిస్తూనే ఏటా హిమాలయాలకు వెళ్లొస్తాంటారు. ఆయా సందర్భాల్లో స్టార్డమ్ పక్కన పెట్టేసి నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు, ఏకాంతవాసంలో ధ్యానంతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా ఆయన జైలర్-2 షూటింగ్కు బ్రేక్ ఇస్తూ తన సన్నిహిత మిత్రులతో కలిసి రిషికేశ్ వెళ్లారు. అక్కడి స్వామి దయానంద ఆశ్రమాన్ని దర్శించి ఆయనకు నివాళులర్పించారు. గంగానది ఒడ్డున ధ్యానం చేశారు. గంగా హారతిలో పాల్గొన్నారు. అక్కడి పర్వత ప్రాంతాల్లో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఒక ఫోటోలో రజనీకాంత్ రోడ్డుపక్కనే అల్పాహారం తీసుకుంటూ ఎంతో సింపుల్గా కనిపిస్తున్నారు. మరో చిత్రంలో తెల్లటి దుస్తులు ధరించి స్థానికులతో ఆశ్రమంలో ముచ్చటిస్తూ కనిపించారు. ఎంత ఎదిగినా ఒదిగిపోవాలనే రజనీ తత్వాన్ని ప్రతిబింబించేలా ఆయన ఆధ్యాత్మిక పర్యటన సాగుతోందని చెబుతున్నారు.


