
మోదీ చాలా ప్రమాదకారి.. : మల్లికార్జున ఖర్గే
పాట్నా ఆగస్టు 17 (గోల్కొండ ):
ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్పీని మోదీ దోచుకుంటున్నారని విమర్శించారు.స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శుక్రవారంనాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రశంసించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ప్రధాన మంత్రి ‘చాలా ప్రమాదకర వ్యక్తి’ అని, ఆయనను అధికారం నుంచి తొలగించాలని అన్నారు. బీహార్లోని సాసారాంలో ఆదివారంనాడు జరిగిన విపక్ష ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, బీజేపీని అధికారం నుంచి తొలగించేంత వరకూ ప్రజల ఓట్లు, హక్కులు, స్వేచ్ఛకు, చివరకు రాజ్యాంగానికి కూడా భద్రత లేదని అన్నారు.దేశ స్వాతంత్ర్యానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తులను ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పొడగటం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. ‘మీ వాళ్లెవరూ జైలుకు స్వాతంత్య్ర పోరాటంలో వెళ్లలేదు. ఉద్యోగాలు కావాలంటూ మీవాళ్లు బ్రిటిష్ వారికి దరఖాస్తులు చేసుకున్నారు. మేము వాళ్లతోనే ఉంటామని కూడా తెగేసి చెప్పారు. అలాంటి వ్యక్తుల పేర్లను ఎర్రకోట నుంచి ప్రధాని ప్రస్తావించడమంటే దేశ స్వాతంత్ర్య కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలకు మీరెలాంటి సమాధానమిస్తారు’ అని ఖర్గే నిలదీసారు. ఆ కారణంగానే మోదీ చాలా ప్రమాదకరమైన వ్యక్తని తాను చెప్పగలనని అన్నారు


