
భారత్లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్కు వెళ్లే ఉద్దేశం లేదు..షేక్ హసీనా
న్యూఢిల్లీ, అక్టోబరు 29:(గోల్కొండ ): భారతదేశంలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, ఇండియాను వదిలి వెళ్లే ఉద్దేశం తనకు లేదని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా అన్నారు. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో హింస నేపథ్యంలో పారిపోయి ఇండియాకు వచ్చిన హసీనా బుధవారం మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ అవామీలీగ్ను పోటీ చేయనివ్వకపోతే కోట్లాది మంది ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారని ఆమె మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీ తప్ప ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా తాను బంగ్లాదేశ్కు వెళ్లబోనని చెప్పారు. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ గుర్తింపును బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం మే నెలలో రద్దు చేసింది. ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్లో హింస సందర్భంగా పోలీసుల కాల్పుల్లో, ఇతర ఘటనల్లో చనిపోయిన 1400 మంది కుటుంబాలకు క్షమాపణలు చెప్పడానికి హసీనా నిరాకరించారు. అయితే, సంతాపం వ్యక్తం చేశారు.


