
కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి.. అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు. ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లి నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని.. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించాను. రాష్ట్రాన్ని ప్రగతి వెలుగులతో నింపేందుకు చేస్తున్న ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు, ప్రజల సహకారం కోరుకుంటూ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


