
మెట్రో రైలులో గ్రీన్ చానల్…
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (గోల్కొండ ):
హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య ఈ గ్రీన్ చానల్ చేపట్టారు.ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి లో ఓ దాత నుంచి సేకరించిన గుండెను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద యశోద ఆస్పత్రికి చేర్చారు. 11 కి.మీ. దూర ప్రయాణాన్ని కేవలం 16నిమిషాల్లోనే పూర్తి చేశారు. అలాగే, ఊపిరితిత్తులను కూడా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి మాదాపూర్ యశోద ఆస్పత్రికి చేర్చారు.
21 మెట్రో స్టేషన్లను దాటుకొని 27కి.మీ. దూరాన్ని 43నిమిషాల్లోనే ప్రయాణించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రాత్రి సమయంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పటికీ కేవలం 45నిమిషాల వ్యవధిలోనే గుండె, ఊపిరితిత్తులను రెండు ప్రాంతాలకు తరలించామని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు , వైద్య నిపుణులు, ఆస్పత్రి అధికారులు ఎంతో సమన్వయం చేసుకుని ఈ గ్రీన్చానల్ ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు


