
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ):
రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు.
కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కార్యాయాలు పూర్తిగా ప్రజలకు స్నేహ పూర్వక వాతావరణంలో, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించగా, ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లోని తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.


