
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..!
హైదరాబాద్ అక్టోబరు 20 (గోల్కొండ ):
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ అండమాన్ని అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఏండీ తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం, శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అలానే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లుగా టీజీడీపీఎస్ వెల్లడించింది. హైదరాబాద్ కు కూడా వర్షం పడే అవకాశం ఉందట.


