
సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి తెప్పించండి.. ప్రభుత్వానికి నేతాజీ కూతురి విజ్ఞప్తి
ఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ):నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆస్థికలను భారత్కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ 80వ వర్థంతి కార్యక్రమం జరగబోతోంది. జపాన్ లో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని చెబుతున్నారు. దీంతో ఆగస్టు 18వ తేదీనే నేతాజీ వర్థంతిని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు అనితా బోస్ ఈ విజ్ఞప్తి చేశారు.
తన తండ్రి అస్థికలు స్వదేశానికి తిరిగి రావడాన్ని చూడాలనే తన చిరకాల కోరికను అనిత వ్యక్తపరిచారు. టోక్యోలోని రెంగేజీ ఆలయంలో భద్రపరిచిన అస్థికలు నేతాజీవే అని చాలా మంది నమ్ముతున్నారు. వాటికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆమె కోరుతున్నారు. నేతాజీ మరణం చుట్టూ దశాబ్దాలుగా ఉన్న వివాదాలను ఇప్పటికైనా పరిష్కరించాలని భారత ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. వివిధ కుట్ర సిద్ధాంతాలకు శాస్త్రీయ ఆధారాలతో చెక్ పెట్టాలని, అలాగే తన తండ్రి జ్ఞాపకాలను గౌరవించాలని ఆమె నొక్కి చెప్పారు.
ఈ నెల చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో అనితా బోస్ ఈ విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని అధికారిక కథనం చెబుతున్నప్పటికీ, ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, అజ్ఞాతంలో జీవించారని అనేక మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా భారతదేశంలోనే నేతాజీకి అంతిమ వీడ్కోలు పలకాలని, ఆయన చితాభస్మాన్ని అన్ని వర్గాల ప్రజలు వీక్షించి స్వాతంత్ర్య సమరయోధుడికి చివరి నివాళులు అర్పించాలని అనితా బోస్ ఆకాంక్షిస్తున్నారు.


