మోదీతో భేటీ కానున్న చైనా మంత్రి

మోదీతో భేటీ కానున్న చైనా మంత్రి

న్యూఢిల్లీ ఆగస్టు 17 (గోల్కొండ ) : భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం నాడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో కలుసుకుంటారు. సోమవారం మధ్యాహ్నం 4.15 గంటలకు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాంగ్ యి చేరుకుంటారు. అనంతరం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను హైదరాబాద్ హౌస్‌లో కలుసుకుని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్న వాంగ్ యి తన పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్‌ను కూడా కలుసుకుంటారు. చైనా-భారత్ సరిహద్దు సమస్యలపై ఈ భేటీలో చర్చలు జరుపుతారని ఇండియాలో చైనా రాయబారి జీ ఫీహోంగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. భారత్ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వాంగ్ యి వస్తున్నారని, సరిహద్దుల అంశంపై చైనా-ఇండియా ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరుగుతున్న 24వ రౌండ్ చర్చల్లో పాల్గొంటారని చెప్పారు.
2020లో గల్వాన్ సంఘర్షణలు, కోవిడ్-19 నేపథ్యంలో భారత్-చైనాల మధ్య విబేధాలు చోటుచేసుకున్నారు. ఆ తర్వాత క్రమంలో లద్దాఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస్ మానససరోవర్ యాత్ర పున: ప్రారంభం కావడం వంటి విషయాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో వాంగ్ యి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!