
బీహార్ తొలి దశ ఎన్నికలు ముగిసాయి ..
పాట్నా నవంబరు 06 (గోల్కొండ ):దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ రోజు తొలి దశ పోలింగ్లో భాగంగా 121 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది
మొత్తం 121 నియోజకవర్గాల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే జరిగింది . లఖిసరాయ్ నియోజకవర్గంలో మాత్రం కాస్త ఆందోళన నెలకొంది. బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. లఖిసరాయ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను విజయ్ కుమార్ సందర్శిస్తున్న సమయంలో ఆయన కారును కొందరు వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు . విజయ్ కుమార్ వాహనంపై చెప్పులు, పేడ విసరడంతో పాటు, ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.


