
యువత మేలుకో
నేటి యువత రేపటి బావి భారత పౌరులు అన్నారు పెద్దలు. నేటి యువత సమాజంలోని మంచి, చెడు తెలుసుకొని క్రమశిక్షణతో మెదిలినప్పుడే తమ యొక్క ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు.
కానీ నేటి సమాజంలో సాంకేతిక విప్లవం వలన సెల్ ఫోన్ ప్రతి ఒకరికి ముఖ్యగా యువతకు అందుబాటులోకి రావడం వలన వారిలో ఆలోచన విధానం మారిపోయి అనేకనార్థాలకు, కష్టాలకు దారితీసి తమ జీవిత లక్ష్యాన్ని చేరుకోలేక చెడు అలవాట్లకు లోనవుతున్నారు.
యువత ఎక్కువ గా సెల్ ఫోన్ కు దగ్గర కావడం వలన వివిధ రకాల చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. సెల్ ఫోన్ తో ఎక్కువగా ఆన్లైన్ గేమ్లు ఆడడం, పలు బెట్టింగ్ యాప్ ద్వారా ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచన చేయడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ చేయడం చూడడం వంటి అలవాట్లతో తమ విలువైన సమయాన్ని కోల్పోతూ చదువుపై, చేసే పనిపై అనాసక్తిని చూపుతున్నారు.దీంతో యువత డ్రగ్స్,గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు, సిగరెట్లకు అలవాటు పడి అనారోగ్యానికి గురవుతూ ఆర్థికంగా చితికి పోతున్నారు. కొందరు యువత జీవితం పై విరక్తి చెందు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం వలన తల్లిదండ్రులు పడే బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నేటి సమాజంలోని యువత ప్రవర్తనను చూసి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ముఖ్యంగా మేధావులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఆటల పై ఆసక్తి పెంచాలి
ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో ఒక ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అన్నట్లు నేటి యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే తమ జీవితంలో కొంత సమయాన్ని వ్యాయామంకు, క్రీడలకు కేటాయించాలి. ఒకప్పుడు యువత తీరిక సమయంలో వివిధ క్రీడల పట్ల ఆసక్తి చూపేవారు. కానీ నేటి యువత క్రీడల పట్ల, వ్యాయమం పట్ల సరిగా శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేగాక సెల్ ఫోన్, టీవీలకు అంకితమై తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేటి యువతను వ్యాయామం, క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి.
యువత ఉన్నతమైన లక్ష్యం ఎంచుకోవాలి
నేటి యువత ఎలాంటి లక్ష్యం లేకుండా చదువుకోవడం సమయం వృధా చేసుకోవడం గమనించవచ్చు. కావున ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన కోసం నిరంతరం ఆలోచన చేయాలి. తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాన్ని సాధించుకోని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చవలసిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు యువతతో తరచుగా మాట్లాడుతూ ఉండాలి
నేటి యువతను వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలి.వారు ఎక్కువ సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నారు, ఎలాంటి స్నేహితులతోటి తిరుగుతున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ సమయాన్ని వృధా చేసే పనులు పట్ల, చెడు స్నేహితుల పట్ల ఎప్పటికప్పుడు మృదుగా హెచ్చరిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు అవసరం మేరకు మాత్రమే ప్యాకెట్ మనీ ఇవ్వాలి. వారి పిల్లల చదువుపై, కెరియర్ పై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, ప్రోత్సాహిస్తూ ఉండాలి.అంతేగాక తల్లిదండ్రులు పిల్లలకు వారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి, కుటుంబ సభ్యుల పట్ల మర్యాద గౌరవం గురించి,తమ బంధువులలో ఉన్నత స్థానలో ఉన్న వ్యక్తుల గురించి తెలిజేయాలి.
డా. పోతరవేణి తిరుపతి, స్టూడెంట్స్ కౌన్సిలర్, కరీంనగర్
9963117456


