
టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు.. వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ల హవా
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు . మొత్తం 784 పాయింట్లతో గిల్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇక, టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ ఖాతాలో 756 పాయింట్లు ఉన్నాయి.నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలు ఆడలేదు. అయితే వన్డే ర్యాంకింగ్స్లో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ వెస్టిండీస్తో తాజాగా జరిగిన వన్డే టోర్నీలో విఫలమయ్యాడు. దీంతో బాబర్ 751 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక, కింగ్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఖాతాలో 736 పాయింట్లు ఉన్నాయి. అలాగే, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 708 పాయింట్ల తో ఎనిమిదో స్థానంలోనూ, కేఎల్ రాహుల్ 15వ స్థానంలోనూ నిలిచారు.ఐసీసీ ప్రకటించిన ఈ వన్డే ర్యాంకింగ్స్లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్-5లో నిలవడం విశేషం. కాగా, టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్లు, టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.


