
టీ-20 క్రికెట్లో టీమిండియా హవా.. వివిధ విభాగాల్లో నెంబర్ వన్లు మనవాళ్లే.
అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఆసియా కప్లో తొలి రెండు మ్యాచ్ల్లోనూ అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్మురేపారు . టీ-20 బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తాజాగా బౌలింగ్ విభాగంలో కూడా భారతీయ ఆటగాడే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.తాజాగా ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. బౌలింగ్ విభాగంలో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాదంతా వరుణ్ నిలకడగా వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుణ్ నెంబర్ వన్ టీ20 బౌలర్గా అవతరించాడు. వరుణ్ కంటే ముందు జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో అగ్రస్థానానికి చేరిన భారత బౌలర్లుగా నిలిచారు. ప్రస్తుతం వరుణ్ ఖాతాలో 733 పాయింట్లు ఉన్నాయి. వరుణ్ తర్వాత రవి బిష్ణోయ్ (8వ స్థానం) మాత్రమే టాప్ టెన్లో కొనసాగుతున్న భారతీయ బౌలర్ .టీ20 బ్యాటింగ్ విభాగంలో నెంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు ఆసియా కప్లోని తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టడంతో తన పాయింట్ల (884)ను మెరుగుపరుచుకున్నాడు. టాప్ టెన్లో తిలక్ వర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (7) ఉన్నారు. ఇక, ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన టాప్ పొజిషన్ను నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 12వ స్థానం దక్కించుకున్నాడు.


